ముంబై: మహారాష్ట్రలో నాసిరకంగా రోడ్ల(Maharastra Roads)ను నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. జాల్నా జిల్లాలోని అంబాద్ తాలూకాలో ఉన్న కార్జత్ హస్త్ పోఖరి గ్రామంలో .. తారు రోడ్డును సరైన రీతిలో వేయలేదు. కార్పెట్ లాంటి వస్తువుపై డాంబర్ రోడ్డును వేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇక ఆ తారు రోడ్డును వాళ్లు చేతులతో లేపి మరీ చూపిస్తున్నారు.
స్థానిక కాంట్రాక్టర్ నిర్మిస్తున్న ఆ రోడ్డుపై విమర్శలు వస్తున్నాయి. బోగస్ పనుల వల్ల నాణ్యత లేని రోడ్డులను నిర్మిస్తున్నట్లు కాంట్రాక్టర్ రాణా థకూర్పై ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి గ్రామీణ రోడ్డు స్కీమ్ కింద ఆ రోడ్డును వేశారు.
జర్మనీ టెక్నాలజీ ప్రకారం ఆ రోడ్డును నిర్మిస్తున్నట్లు కాంట్రాక్టర్ చెబుతున్నాడు. కానీ ఆ రోడ్డు అధ్వాన్నంగా ఉన్నట్లు గ్రామస్థులు ఆ వీడియోలో పేర్కొన్నారు. రోడ్డు పనులకు అనుమతి ఇచ్చిన ఇంజినీర్పై చర్యలు తీసుకోవాలని స్థానికులు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.