లఖింపూర్ కేసులో ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి కుమారుడు ఆశీశ్ మిశ్రాకు బెయిల్ దొరికింది. దీనిపై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ భగ్గుమన్నారు. ఈ స్థానంలో సామాన్యుడు గనక ఉంటే.. ఇంత తొందరగా బెయిల్ దొరికేదా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇక కోర్టు తీర్పుపై ఏం మాట్లాడతాం? బెయిల్ ఇచ్చేశారు. 302 సెక్షన్ కింద ఇతరులకు కూడా ఇలాగే బెయిల్ దొరికితే సంతోషం. ఇలాగే బెయిల్ దొరకకుంటే ఇక చూసుకోండి అంటూ రాకేశ్ టికాయత్ ఫైర్ అయ్యారు. ఇక.. యూపీ ప్రచారంలో ఈ అంశాన్ని తెరపైకి తెస్తామని, ఇంత తొందరగా ఏ సాక్ష్యాలు దొరికాయని బెయిల్ వచ్చిందని రాకేశ్ టికాయత్ సూటిగా ప్రశ్నించారు.
మా రైతుల వద్ద ఇంత పెద్ద లాయర్ లేరని, ఎదుటి వారు చాలా పెద్ద హోదాలో ఉన్నారని దెప్పి పొడిచారు. వారు ప్రభుత్వంలో ఉన్నారని, పెద్ద పెద్ద లాయర్లను వాదించడానికి పెట్టుకున్నారని, అందుకే బెయిల్ దొరికిందేమోనన్నారు. కోర్టులు మాత్రం సాక్ష్యాల ఆధారంగానే నడుస్తాయన్నారు. రైతుల పక్షాన ఎవరు పైరవీలు చేస్తారు? వారి దగ్గర32 మంది న్యాయవాదులున్నారని టికాయత్ పేర్కొన్నారు.
యూపీలోని లఖింపూర్లో గతేడాది అక్టోబర్లో హింసాత్మక ఘటన జరిగింది. ఇందులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశీశ్ మిశ్రా ప్రధాన నిందితుడు. ఈయనకు అలహాబాద్ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. సరిగ్గా యూపీ ఎన్నికల మొదటి దశ ప్రారంభమైన రోజే ఈయనకు బెయిల్ రావడం గమనార్హం.