న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన పది రోజుల తర్వాత రాజ్యసభా కార్యక్రమాలు తొలిసారి సజావుగా సాగాయి. సభ లోపల, బయట కొనసాగిస్తున్న నిరసనలకు విపక్ష సభ్యులు గురువారం విరామం ఇచ్చారు. తమిళనాడులో సైనిక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, మరో 11 మంది రక్షణ సిబ్బందికి నివాళి అర్పించారు.
నవంబర్ 29న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా, గత సమావేశాల్లో భద్రతా సిబ్బంది పట్ల అమర్యాదగా ప్రవర్తించిన 12 మంది సభ్యులను శీతాకాల సమావేశాల వరకు సస్పెండ్ చేశారు. దీంతో రాజ్యసభలో తొలి రోజు నుంచే విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. 12 మంది సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సభ లోపల, వెలుపల నిరసనలు కొనసాగిస్తున్నారు. బుధవారం టీడీపీ, వైసీఎస్ఆర్సీపీ సభ్యులు తప్ప మిగతా పార్టీలకు చెందిన సభ్యులు సభా కార్యక్రమాలను బహిష్కరించారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేశారు.
కాగా, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన బిపిన్ రావత్, ఇతరులకు నివాళి అర్పించేందుకు గురువారం మాత్రమే నిరసనలకు విరామం ఇచ్చినట్లు రాజ్యసభ్యలో విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే గురువారం తెలిపారు. అయితే ఈ ఘటనపై మాట్లాడేందుకు విపక్ష సభ్యులకు అవకాశం ఇవ్వని డిప్యూటీ చైర్మన్పై ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ జీరో హవర్, ప్రశ్నోత్తరాలు సజావుగా సాగేందుకు సహకరించామన్నారు.