న్యూఢిల్లీ, జూలై 18: వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజైన సోమవారమే విపక్షాల నిరసనలతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. ధరల పెరుగుదల, అగ్నిపథ్ స్కీమ్, జీఎస్టీ పెంపుపై చర్చకు ప్రతిపక్షాల సభ్యులు పట్టుబట్టారు. దీంతో ఉభయసభలను మంగళవారానికి వాయిదా వేశారు. కొత్తగా లోక్సభకు ఎన్నికైన తృణమూల్ నేత శతృఘ్నసిన్హా, ఇద్దరు బీజేపీ నేతలు దినేశ్ లాల్ యాదవ్, ఘన్శ్యామ్ సింగ్తో స్పీకర్ ఓంబిర్లా ప్రమాణం చేయించారు. అనంతరం న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కుటుంబ న్యాయస్థానాలు (సవరణ) బిల్లును దిగువ సభలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ధరల పెరుగుదల, అగ్నిపథ్ స్కీమ్, జీఎస్టీ పెంపుపై చర్చ జరుగాలని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరీ, వామపక్షాలు పట్టుబట్టాయి. పొడియం ముందుకు వచ్చి ఫ్లకార్డులు ప్రదర్శించాయి. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో సభ్యులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెబుతూ స్పీకర్ ఓంబిర్లా సభను మంగళవారానికి వాయిదా వేశారు.
అటు రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు ద్రవ్యోల్బణం, అగ్నిపథ్ స్కీమ్, జీఎస్టీపై చర్చించాలని డిమాండ్ చేశారు. విపక్ష సభ్యుల ఆందోళనలపై ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ‘సభను సవ్యంగా సాగనివ్వకుండా, సభ్యులను రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్కు వెళ్లనీయకూడదన్న ఉద్దేశంతోనే కొందరు ఇక్కడికి వచ్చారు. సభ ను మంగళవారానికి వాయిదా వేస్తున్నా’ అని ప్రకటించారు. అంతకుముందు ఇటీవల దారుణహత్యకు గురై న జపాన్ మాజీ ప్రధాని షింజో అబెకు ఇరుసభలు సంతాపం తెలిపాయి. సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఫలప్రదమైన చర్చ సాగించాలని సభ్యులకు విజ్ఞప్తి చేశారు.