న్యూఢిల్లీ, జూన్ 3: లైగింక వేధింపులకు పాల్పడ్డ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలని రెజ్లర్లు చేస్తున్న ఆందోళనలపై మౌనం వహిస్తున్న బీజేపీపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ విరుచుకుపడ్డారు. ఈ అంశంపై ఇప్పటికీ స్పందించకుండా మౌనం వహిస్తున్న ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ, ఆర్ఎస్ఎస్లను ఆయన దుయ్యబట్టారు. సబ్ కా సాత్ కాదు… బ్రిజ్ భూషణ్ కా సాత్ అన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తున్నదని విమర్శించారు. మోదీ, షా, బీజేపీ, ఆర్ఎస్ఎస్లు మౌనంగా ఉంటూ బ్రిజ్ భూషణ్ను కాపాడాలనే సందేశాన్ని దర్యాప్తు సంస్థలకు ఇస్తున్నట్టు ఆయన విమర్శించారు. సాక్ష్యాధారాలు సమర్పిస్తున్నా, ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నా మోదీ, షా చలించడం లేదని వ్యాఖ్యానించారు.
లా కమిషన్ సిఫార్సులు గణతంత్ర పునాదులకు విరుద్ధం
దేశ ద్రోహ చట్టాన్ని లా కమిషన్ సమర్థించడం గణతంత్ర పునాదులకు, నైతికతకు విరుద్ధమని ఎంపీ కపిల్ సిబల్ విమర్శించారు. దేశద్రోహం చట్టంలోని సెక్షన్ 124ఏ రద్దు సరికాదని లా కమిషన్ సిఫార్సులు చేసిన విషయం విదితమే. కనీస శిక్షను మూడేండ్ల నుంచి ఏడేండ్లకు పెంచాలని కమిషన్ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులు తనను కలవరపరిచాయని సిబల్ అన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి నోరు మూయించడమే బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు.