న్యూఢిల్లీ, మార్చి 22: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అరెస్టు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ విమర్శించారు. కేజ్రీవాల్ అరెస్టుపై శుక్రవారం సిబల్ స్పందిస్తూ.. ‘బీజేపీ చేస్తున్నదంతా ప్రజలందరూ ఊహించిందే. ఇది మొదలైనప్పుడే చెప్పా.. జరగాల్సింది ఇంకా చాలా ఉంది అని. ఎవరైతే ఎన్నికల్లో తమకు పోటీ అని భావిస్తారో, ఎవరైతే తమ వ్యతిరేక పార్టీకి నేతృత్వం వహిస్తారో వారిని వీల్లు అరెస్టు చేస్తారు. కవితను ఎలా వేధించి అరెస్ట్ చేయించారో చూశాం. అంతకుముందు హేమంత్ సొరేన్ను అరెస్ట్ చేయించారు. ఇప్పుడు కేజ్రీవాల్ను కుట్రపూరితంగా నిర్బంధించారు. మున్ముందు రాఘవ్ చడ్డాను కూడా ఇలాగే టార్గెట్ చేయనున్నారు.
నితీశ్కుమార్ కూడా మరోసారి వారితో పొత్తులోకి వెళ్లకపోయి ఉంటే అక్కడ ఆయన పరిస్థితి కూడా ఇలాగే ఉండేది. ఇదే తరహాలో మహారాష్ట్రలో కూడా అనేక మందిపై బీజేపీ అక్రమంగా కేసులు పెట్టింది. దాంతో వారందరూ బీజేపీలో చేరారు. ఇదంతా బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడ. కోర్టులు దీన్ని అడ్డుకోకపోతే? మౌనంగా ఉంటే? ఈ అరాచకానికి అడ్డుకట్ట ఉండదు. మరింత దారుణ పరిస్థితులు మనం చూడబోతున్నాం. మోదీ సర్కారుకు డిఫాక్టో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఈడీనే. బీజేపీకి ఈడీ.. నమ్మకమైన పనోడిలా మారింది. అసలు ఢిల్లీ లిక్కర్ కేసులో ఏముంది? అది జీరో కేసు. ఏమీ లేదు. అంతా డొల్ల. ముందుగా ఒకరిని సాక్షిగా తెచ్చారు. అతడు మొదటి స్టేట్మెంట్లో నీకేమీ తెలియదని చెప్పాడు.
రెండో స్టేట్మెంట్లో నాకు కొంత మాత్రమే తెలుసని చెప్పాడన్నారు. ఆ తర్వాత మూడోది, నాలుగో స్టేట్మెంట్స్ వచ్చాయి. ఐదో స్టేట్మెంట్లో అదే సాక్షి.. డబ్బులు ఫలానావారికి ఇవ్వనున్నారని కొందరి పేర్లు చెప్పాడంటారు. ఆ తర్వాత అతను అప్రూవర్గా మారాడంటారు. అతనికి అందరికంటే ముందు బెయిల్ వస్తుంది. దినేశ్ అరోరా, మాగుంట ఇలాంటి వారంతా ఇలాగే అప్రూవర్స్గా మారారు కదా. ఇప్పుడు ఈడీ చెబుతున్న సాక్ష్యాలన్నీ.. ఈ అప్రూవర్లవే కదా. బలమైన ఆధారాలు లేకుండా అప్రూవర్లు చెప్పిన దాన్ని సాక్ష్యంగా పరిగణించబోమని సుప్రీంకోర్టు గతంలో అనేక కేసుల్లో, అనేకసార్లు స్పష్టం చేసింది. ఈ కేసులో కూడా ఎలాంటి ఇతర సాక్ష్యాలు లేవు. దేశప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అనేక అవినీతి కేసుల్లో అరెస్ట్ చేయాల్సిన దోషుల నుంచి మోదీ సర్కారు ముందుగా బాండ్స్ పేరిట డబ్బు తీసుకున్నది. ఇప్పుడు ఆ స్కీం కూడా ఆగిపోయింది. అందులో పైసలు రావట్లేదు. ఇదంతా బీజేపీ ఆడిస్తున్న రాజకీయ నాటకం. దేశ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది’. అని పేర్కొన్నారు.