న్యూఢిల్లీ, అక్టోబర్ 18: దేశంలో స్వతంత్రంగా భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ పౌరులకే కాదు.. భారత ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెటులో ఎంపీలకు కూడా లేకుండా పోతున్నది. ఏమన్నా అంటే సస్పెండ్, లేదంటే నిండు సభలో అంతు చూస్తామంటూ అధికార పార్టీ సభ్యుల బరితెగింపు హూంకరింపులు. ఇలాంటి దృశ్యాలు ఈ మధ్య పరిపాటి అయిపోయాయి. తాజాగా రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారని బీఆర్ఎస్ ఎంపీలపై అధికార బీజేపీ ఎంపీ ఒకరు సభా చైర్మన్ ధన్కడ్కు ఫిర్యాదు చేయటం, ఆయన వెంటనే ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేయటం చకచకా జరిగిపోయాయి.
గత నెల 18 పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావుతోపాటు దీవకొండ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేశ్రెడ్డి, బీ లింగయ్య యాదవ్ పలు సమస్యలపై రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ చర్య మహా పాపం అన్నట్టుగా బీజేపీ ఎంపీ వివేక్ ఠాకూర్ సభాధ్యక్షుడు జగ్దీప్ ధన్కడ్కు ఫిర్యాదు చేశారు. రూల్ 188 కింద నోటీస్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించటం వల్ల సభా కార్యకలాపాలకు భంగం కలిగిందని, వారు సభా నియమాలను ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ధన్కడ్.. రాజ్యసభ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ రూల్ 203 కింద ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేస్తూ.. ఆ నోటీసును పరిశీలించి, విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు.
దేశంలో ఏ మూలన ప్రజలకు ఏ సమస్య వచ్చినా పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభ్యుడైనా దాన్ని లేవనెత్తేందుకు హక్కు ఉన్నది. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపేందుకు ప్రతిపక్ష సభ్యులు సభలో అనేక మార్గాల్లో నిరసనలు తెలుపుతారు. గతంలో ప్రతిపక్షాలు సెషన్లకు సెషన్లనే ఎలాంటి చర్చలు జరుగకుండా అడ్డుకొన్న సందర్భాలున్నాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్లమెంటులో అరాచకంగా వ్యవహరించిన రికార్డులు భద్రంగా ఉన్నాయి. సభ్యులు సభలో ఎలా నడుచుకోవాలనేదానిపై లోక్సభ, రాజ్యసభలకు ప్రత్యేక నియమావళులు ఉన్నాయి. వాటిని అతిక్రమిస్తే సభాధ్యక్షులు సదరు సభ్యులపై చర్యలు తీసుకోవచ్చు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రూల్స్ను ఏనాడూ పాటించలేదు.
ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ పార్టీకి రూల్స్ గుర్తుకు వచ్చాయని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక ఈ ఫిర్యాదు విషయానికి వస్తే.. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావుకు పార్లమెంటు సభ్యుడిగా సుదీర్ఘ అనుభవం ఉన్నది. పార్టీలకతీతంగా ఆయనను పార్లమెంటులో అందరూ గౌరవిస్తారు. ఆయన పదవీకాలంలో నియమాలను ఉల్లంఘించిన చరిత్ర కూడా లేదు. బీజేపీ సభ్యుడు కేకేపై ఫిర్యాదు చేయటంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతున్నది. తెలంగాణలో ఎన్నికలవేళ బీఆర్ఎస్ను బెదిరించాలన్న ప్రయత్నాల్లో భాగంగానే బీజేపీ ఇలాంటి ఎత్తులు వేస్తుండవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.