న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఉపరాష్ట్రపతిగా ఈనెల 10న(బుధవారం) పదవీ విరమణ చేయనున్న ఎం వెంకయ్యనాయుడికి రాజ్యసభలో సభ్యులు సోమవారం వీడ్కోలు పలికారు. రాజ్యసభ చైర్మన్గా వెంకయ్య అందించిన సేవలను ఎంపీలు కొనియాడారు. ఆత్మకథ రాయాలని పలువురు సభ్యులు ఆయనను కోరారు. మొదటగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఐదేండ్లు ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్గా వెంకయ్య సమర్థవంతంగా పనిచేశారని ప్రశంసించారు. వెంకయ్య ఏకవాక్య సంబోధనలు చాలా చమత్కారంగా ఉంటాయని, ఆయన ప్రతిమాటను అంద రూ ఆసక్తిగా వింటారని పేర్కొన్నారు. ఒత్తిడిలోనూ వెంకయ్య పనితీరు ప్రశంసనీయమని కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే అన్నారు. వెంకయ్యనాయుడి చిన్నప్పటి జీవితం గురించి టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ మాట్లాడుతున్న సమయంలో వెంకయ్య కొంత భావోద్వేగానికి గురయ్యారు.
నా కర్తవ్యాన్ని నెరవేర్చా
వీడ్కోలు ప్రసంగం సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ సభను సజావుగా నడుపడంలో తన కర్తవ్యాన్ని నెరవేర్చానని అన్నారు. సభ గౌరవాన్ని కాపాడేలా, కార్యకలాపాలు సజావుగా జరిగేలా హుందాగా వ్యవహరించాలని సభ్యులను కోరారు. రాజ్యసభ వాయిదా అనంతరం సాయంత్రం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో వెంకయ్యనాయుడుకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ పార్లమెంట్లో తమకు మెజార్టీ ఉన్నప్పటికీ, అధికార పక్షం ప్రతిపక్షాలకు తగిన గౌరవం ఇవ్వాలని సూచించారు.
8వ వేతన కమిషన్ ఏర్పాటు యోచన లేదు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన కమిషన్ ఏర్పాటుచేసే యోచనేమీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంజక్ చౌదరి వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఆయన లోక్సభకు రాతపూర్వక సమాధానమిచ్చారు.
4 రోజుల ముందే ముగిసిన పార్లమెంట్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే నాలుగు రోజుల ముందుగానే ముగిశాయి. ఇటు రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనాయుడు, అటు లోక్సభలో స్పీకర్ ఓంబిర్లా సభలను సోమవారం నిరవధిక వాయిదా వేశారు. జూలై 18న ప్రారంభమైన పార్లమెంట్ వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈనెల 12 వరకు జరగాల్సి ఉన్నది. అయితే ముందుగానే నిరవధిక వాయి దా పడటం గమనార్హం. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ధరల పెరుగుదల, నిత్యావసరాలపై జీఎస్టీ విధింపు, అగ్నిపథ్, తదిరత అంశాలపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు ఉభయసభల్లో ఆందోళనలతో హోరెత్తించిన విషయం తెలిసిందే.