న్యూఢిల్లీ: 12 మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. వార్షాకాల సమావేశాల్లో చివరి రోజు 12 మంది రాజ్యసభ ఎంపీలు అనుచితంగా వ్యవహరించింది. అయితే వారిని శీతాకాల సమావేశాల్లో పూర్తిగా సస్పెండ్ చేశారు. దీనిపై ఇవాళ రాజ్యసభలో చర్చ జరిగింది. 12 మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతున్నామని మల్లిఖార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. వర్షాకాల సమావేశాల్లో జరిగిన ఘటనపై ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. దీనిపై చైర్మన్ వెంకయ్య రియాక్ట్ అయ్యారు. వర్షాకాల సమావేశాల్లో ఎదురైన చేదు అనుభవాలు ఇంకా వెంటాడుతున్నాయన్నారు. రభస సృష్టించిన ఎంపీలపై చర్యలు తీసుకునే హక్కు చైర్మన్కు ఉందని వెంకయ్యనాయుడు తెలిపారు. సస్పెన్షన్ ఎత్తివేత అభ్యర్ధనను తిరస్కరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సస్పెన్షన్ ఎత్తివేతను తిరస్కరించడంతో.. విపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు.