Rajori Encounter | జమ్మూ కశ్మీర్లోని రాజౌరి జిల్లా కలకోట్ అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. అటవీ ప్రాంతంలోని ఉగ్రవాదులు దాక్కున్నారని ఇంటెలిజెన్స్ నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో ఆర్మీ ప్రత్యక బలగాలు, పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే బలగాలను చూసిన ఉగ్రవాదులు.. కాల్పులు జరిపారు. దీంతో బలగాలు సైతం కాల్పులకు దిగడంతో ఎన్కౌంటర్ ప్రారంభమైంది.
ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది. అటవీ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లుగా భావిస్తున్నారు. పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ సిబ్బంది ఉగ్రవాదులను చుట్టుముట్టారు. ప్రస్తుతం సమాచారం మేరకు ఇద్దరు ఆర్మీ కెప్టెన్లు మృతి చెందారు. మరో వైపు ఓ మేజర్ ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడ్డారు.
ఆయనతో పాటు మరో ఆర్మీ జవాను కూడా గాయపడినట్లు సమాచారం. జమ్మూ ఐజీపీ ఆనంద్ జైన్ మాట్లాడుతూ నిర్ధిష్ట సమాచారంతో రాజౌరిలోని కలకోట్ సబ్ డివిజన్ పరిధిలోని ధర్మసల్ పరిధిలోని సోల్కి గ్రామంలో బాజిమాల్ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేరషన్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. నాలుగు రోజుల కిందట కలకోట్ ప్రాంతంలో అనుమానాస్పద కదలికలు కనిపించడంతో భద్రతా బలగాలు నిరంతరాయంగా సోదాలు నిర్వహిస్తున్నాయి.