Rajnath Singh : ఉగ్రవాదం (Terrorism) పై కేంద్ర రక్షణ మంత్రి (Defence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలు అందుకు తగిన పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. కిర్గిస్థాన్ (Kirgistan) లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గత ఏడాది జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పహల్గామ్ (Pahalgam) లో జరిగిన ఉగ్రదాడి (Terror attack) గురించి రాజ్నాథ్ సింగ్ ప్రస్తావించారు.
పవాల్గామ్ ఉగ్రదాడి ఘటన యావత్ మానవాళిని కుదిపేసిందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆ దాడి అనంతరం ‘ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)’ చేపట్టి ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా తప్పించుకోలేరని భారత్ నిరూపించిందని తెలిపారు. ఉగ్రవాదమే ప్రపంచానికి ప్రధాన ముప్పుగా మారిందని వ్యాఖ్యానించారు. తీవ్రవాదం, ఉగ్రవాదంతో పలు సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ పేరు ప్రస్తావించకుండా ప్రభుత్వ మద్దతుతో జరిగే సీమాంతర ఉగ్రదాడులను అస్సలు విస్మరించకూడదని వ్యాఖ్యానించారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని అన్నారు. ఉగ్రవాదులకు సాయపడుతూ ఆశ్రయం కల్పించేవారిపై చర్యలు తీసుకోవడంలో ఎస్సీవో వెనకాడకూడదని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభం గురించి కూడా ఆయన మాట్లాడారు. గత కొన్నేళ్లుగా జరిగిన వరుస ఘర్షణల్లో అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, భారీ ఆస్తి నష్టం కూడా వాటిల్లిందని చెప్పారు. ఉగ్రవాద బెదిరింపులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఈ క్రమంలో ఉద్రిక్తతల పరిష్కారానికి దౌత్య మార్గాలను అనుసరించాలన్నారు.