న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ నీలగిరి కొండల్లో కుప్పకూలిన ఘటన గురించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాని నరేంద్రమోదీకి వివరించారు. ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రక్షణ శాఖ ఎలాంటి చర్యలు చేపట్టింది అనే వివరాలను ఆయన ప్రధానికి తెలియజేశారు. పరిస్థితిని తాను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. ఘటనపై రక్షణశాఖకు చెందిన సీనియర్ అధికారులు సమావేశమై చర్చిస్తున్నట్లు రాజ్నాథ్ చెప్పారు.
కాగా, ప్రమాద ఘటన గురించి రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే కేంద్ర క్యాబినెట్కు కూడా వివరించారు. మరికాసేపట్లో ఈ ఘటనపై ఆయన పార్లమెంట్లో కూడా ప్రకటన చేయనున్నారు. సీడీఎస్ బిపిన్ రావత్ తన కుటుంబసభ్యులు, సిబ్బందితో కలిపి మొత్తం 14 మందితో సూలూర్ నుంచి వెల్లింగ్టన్కు వెళ్తుండగా కూనురు దగ్గర నీలగిరి కొండల్లో వారి హెలిక్యాప్టర్ కూలిపోయింది.