న్యూఢిల్లీ: సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ పథకం అగ్నిపథ్పై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల తర్వాత అగ్నివీరుల భవిష్యత్పై భరోసా ఇచ్చేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు పలు ప్రకటనలు చేస్తున్నాయి. అగ్నిపథ్పై దేశ వ్యాప్తంగా నిరసనల నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతులతో శనివారం సమావేశమయ్యారు. అగ్నిపథ్ స్కీమ్పై వారితో చర్చించారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఖాళీల్లో అర్హులైన అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్ ప్రతిపాదనకు రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్, రక్షణ పౌర పోస్టులు, 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ సంస్థల్లో కూడా అగ్నివీరులకు పది శాతరం రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం మాజీ సైనికులకు వర్తింప చేసే రిజర్వేషన్కు ఇది అదనమని పేర్కొన్నారు.
రాజ్నాథ్ సింగ్ మంత్రిత్వ కార్యాలయం ఈ మేరకు శనివారం ట్వీట్ చేసింది. ‘ఈ నిబంధనలు అమలు చేయడానికి సంబంధిత రిక్రూట్మెంట్ నియమాలకు అవసరమైన సవరణలు చేస్తాం. డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ సంస్థలు తమ రిక్రూట్మెంట్ నిబంధనలకు ఇలాంటి సవరణలు చేయాలని సూచిస్తాం. అవసరమైన వయోపరిమితి సడలింపు కూడా చేస్తాం’ అని రక్షణ మంత్రిత్వ శాఖ అందులో పేర్కొంది.