న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఏజీ పెరారివాలన్కు ఇవాళ సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. జీవితకాల శిక్షను అనుభవిస్తున్న పెరారివాలన్కు బెయిల్ను మంజూరీ చేసింది. తన రిలీజ్ గురించి గతంలో పెరారివాలన్ సుప్రీంలో దరఖాస్తు చేసుకున్నారు. పలు సార్లు విచారణ జరిపిన తర్వాత ఇవాళ కోర్టు ఆయనకు బెయిల్ను మంజూరీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, బీఆర్ గవియాలతో కూడిన ధర్మాసనం ఇవాళ తీర్పునిచ్చింది. పెరారివాలన్ 32 ఏళ్ల నుంచి జైలుశిక్షను అనుభవించాడని, అతని ప్రవర్తనపై ఎటువంటి ఫిర్యాదులు లేవని, గతంలో మూడుసార్లు అతన్ని పెరోల్పై రిలీజ్ చేసినట్లు ధర్మాసనం పేర్కొన్నది. ప్రస్తుతం పెరారివాలన్ పెరోల్పై ఉన్నారని తెలిసిందని, అయితే అతను 30 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారని, ఆ కోణంలో ఆయనకు బెయిల్ మంజూరీ చేయాలనుకుంటున్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది.
రాజీవ్ గాంధీ హత్య కేసులో ఇప్పటికే పెరారివాలన్కు మూడు దశాబ్ధాల నుంచి జైలుశిక్షను అనుభవిస్తున్నాడు.అయితే పెరారీవాలన్ రిలీజ్పై గతంలో తమిళనాడు గవర్నర్ ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. ఆయన ఈ కేసును రాష్ట్రపతికి సిఫారసు చేశారు. నిజానికి పెరారివాలన్ను రిలీజ్ చేయాలని 2018, సెప్టెంబర్ 9వ తేదీన తమిళనాడు మంత్రిమండలి ప్రతిపాదించింది. రాజకీయ కారణాలతోనే తనను జైలు నుంచి రిలీజ్ చేయడం లేదని గతంలో పెరారివాలన్ ఆరోపించారు.