Rajiv Gandhi Assassination Case | రాజీవ్ గాంధీ హత్య కేసు దోషుల విడుదలపై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయనున్నది. దివంగత ప్రధాని హత్య కేసులో ప్రేమయం ఉన్న ఆరుగురు దోషులను విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలను సవాల్ చేసేందుకు కాంగ్రెస్ సన్నద్ధమవుతున్నది. వారం రోజుల్లో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం సైతం మాజీ ప్రధాని హత్య కేసు దోషుల విడుదలపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో 31 సంవత్సరాల పాటు జైలు జీవితం గడుపుతున్న ఆరుగురు దోషులను విడుదల చేయాలని ఈ నెల 11న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. నిందితులు 30 సంవత్సరాలకుపైగా జైలు జీవితం గడిపారని, సత్ప్రవర్తనను పరిగణలోకి తీసుకొని నేరస్తుల శిక్షను తగ్గించాలని తమిళనాడు ప్రభుత్వం చేసిన సిఫారసు మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో నళిని శ్రీహరన్తో పాటు ఆర్పీ రవిచంద్రన్, సంతన్, మురుగన్, రాబర్ట్ పయస్, జయకుమార్ కోర్టు ఆదేశాలతో జైలు నుంచి విడుదలయ్యారు. గతేడాది మేలో మరో దోషి ఏజీ పెరారివాళన్ను సైతం సుప్రీంకోర్టు విడుదల చేసింది.
1991 మే 21న తమిళనాడు శ్రీపెరంబుదూర్లో ఎన్నికల ప్రచారంలో అప్పటి ప్రధాని రాజీవ్గాంధీ పాల్గొన్నారు. మహిళా ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకోగా.. ఘటనలో రాజీవ్ మృతి చెందారు. సదరు మహిళను ధనుగా గుర్తించారు. ఈ కేసులో పెరారివాళన్, మురుగన్, సంతన్, రవిచంద్రన్, రాబర్ట్ పాయస్, జయకుమార్, నళిని శ్రీహరన్లతో సహా పలువురిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. ఏడుగురి నిందితులకు టాడాకోర్టు ఉరిశిక్ష విధించగా.. ఆ తర్వాత జీవిత ఖైదుగా మార్చగా.. 30 సంవత్సరాలకుపైగా జైలుజీవితం అనుభవించారు.