Rajasthan Elections | న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్లో పోలింగ్ తేదీని నవంబర్ 23కు బదులుగా 25వ తేదీకి మార్చారు. పలు పార్టీలు, ప్రజా సంఘాల విజ్ఞప్తితో ఈసీ పోలింగ్ తేదీ మార్చింది. నవంబర్ 23న భారీగా శుభకార్యాలు ఉన్నందున పోలింగ్ తేదీ మార్చాలని ఈసీకి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. రాజస్థాన్ అసెంబ్లీకి వచ్చే ఏడాది జనవరి 14తో గడువు ముగియనుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.
2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 200 స్థానాలకు గానూ 100 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 73 స్థానాల్లో విజయం సాధించింది. బహుజన్ సమాజ్ పార్టీతో పాటు ఇతర పార్టీల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ సీనియర్ లీడర్ అశోక్ గెహ్లాట్ సీఎంగా ప్రమాణం చేశారు.