Republic Day | జైపూర్ : శుక్రవారం జరిగిన భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఓ ప్రిన్సిపల్ మద్యం సేవించి హాజరయ్యాడు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు సీరియస్గా స్పందించారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ నాగౌర్ జిల్లాలోని పర్బస్తార్లోని ప్రభుత్వ పాఠశాలలో అరవింద్ కుమార్ అనే వ్యక్తి ప్రిన్సిపల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే రిపబ్లిక్ డే వేడుకలకు ఆలస్యంగా హాజరయ్యాడు. అంతేకాకుండా పీకల దాకా మద్యం సేవించి వచ్చాడు. దీంతో స్థానికులు ఈ విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఆశీష్ మోదీ తీవ్రంగా స్పందించారు. ప్రిన్సిపల్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సస్పెన్షన్లో ఉన్నంత కాలం స్కూల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు.