జైపూర్ : రాజస్థాన్లోని జైసల్మేర్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఐదుగురు మృత్యువాతపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తనోత్ మాతా ఆలయానికి వెళ్తున్న సమయంలో రామ్గఢ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను ప్రస్తుతం మార్చురీలో భద్రపరిచారు. అతివేగంతో వెళ్లిన కారు అకస్మాత్తుగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. అక్కడే ఉన్న పలువురు వ్యక్తులు కారులో ఉన్న వారిని రక్షించారు.
ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు రామ్గఢ్ ఆసుప్రతికి తరలించగా.. అక్కడ వారు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతులంతా గంగానగర్ వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు చేస్తున్నారు. కారు ఎత్తు నుంచి గుంతలో పడడంతో నుజ్జునుజ్జు అయ్యింది. వాహనం నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు శ్రమించాల్సి వచ్చింది. మృతులంతా 24 నుంచి 32 ఏళ్ల మధ్య వయస్కులే. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించి, బంధువులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.