జైపూర్ : రాజస్థాన్ నిరుద్యోగ యువతకు మద్దతుగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే బల్జీత్ యాదవ్ శుక్రవారం 12 గంటల పాటు రన్నింగ్ చేశారు. రాజస్థాన్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ ఫర్ టీచర్ ( REET ) పేపర్ లీకేజీకి సంబంధించి ఎమ్మెల్యే బల్జీత్ నిరసన చేపట్టారు. రాజస్థాన్లోని సెంట్రల్ పార్కులో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి నిరుద్యోగ యువత భారీగా తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బల్జీత్ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు యువతకు చేసిందేమీ లేదన్నారు. ఈ రెండు పార్టీలను దేశం నుంచి తరిమేయాలన్నారు. రీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ కావడంతో పాటు అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు. పేపర్ లీకేజీకి కారణమైన రామ్ కృపాల్ మీనాను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రామ్ కృపాల్ మీనా ఓ ప్రయివేటు కాలేజీ ఓనర్. అయితే ఈయన కాలేజీలో ఉంచిన పేపర్లను ముందే లీక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరీక్ష నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు డ్యూటీలు వేయకుండా, ప్రయివేటు ఉద్యోగులకు డ్యూటీలు వేయడం వెనుక అంతర్యమేంటని ఎమ్మెల్యే బల్జీత్ ప్రశ్నించారు.
అంతే కాదు.. ఉద్యోగం కోరుకునే వారి నుంచి రామ్ కృపాల్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. డబ్బులు ఇచ్చిన నిరుద్యోగ అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు మార్చి.. ఉద్యోగం వచ్చేలా మార్కులు ఇస్తున్నారని ఎమ్మెల్యే బల్జీత్ తెలిపారు. ప్రతీ ఏడాది రీట్ పేపర్ లీక్ అవుతుందని, ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
Rajasthan | Independent MLA Baljeet Yadav runs in a park in Jaipur demanding the arrest of officials responsible for the leak of REET paper pic.twitter.com/n49Tg4S5zx
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 25, 2022