అక్కన్నపేట, మే 15: మండలంలోని కేశవాపూర్ రామస్వామి గుట్టపైన ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా విరాజిల్లుతున్నాడు. ఈ గుట్టపైన స్వామి వారికి గుడి లేదు.. .గోపురం లేదు. చిన్న రేకుల షెడ్లో కొలువైన గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామికి నిత్యం పూజలు, నైవేద్యాలతో పాటు ఏటా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మహా అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ నెల 17వ తేదీన వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవం సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ స్టోరీ… మండలంలోని కేశవాపూర్కు చెందిన కందారపు రమేశాచార్యులు చిన్నప్పటి నుంచి వీరబ్రహ్మేంద్రస్వామి భక్తుడు. మొదట రామస్వామి గుట్టపైన కర్ర చెక్కలతో మందిరంలో స్వామివారి చిత్రపటం ప్రతిష్ఠించి పూజలు మొదలు పెట్టాడు. తర్వాత స్వామి ఆలయ నిర్మాణం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. 2022లో గుట్టపైన తాత్కాలికంగా రేకుల షెడ్ నిర్మాణం చేపట్టి అమ్మవారి సమేత స్వామి వారి విగ్రహాలు తెప్పించి వారం రోజులు పూజలు చేసి మహా అన్నదానం చేపట్టారు. గుట్టపైన స్వామివారి ఆలయ కోసం ప్రభు త్వం నుంచి 20 గుంటల భూమిని మంజూరు చేయించారు. ఇటీవల కరీంనగర్ ఎంపీ నిధుల నుంచి ప్రహరీ నిర్మాణం కోసం రూ. 3 లక్షలు విడదల చేయించారు. ప్రతి ఏటా మార్గశిర మాసంలో ఈశ్వరీమాత ఆరాధన మహోత్సవం, మాఘమాసంలో వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం, పాల్గొణ మాసంలో గోవిందమాంబ అమ్మవారి ఆరాధనోత్సవం, వైశాఖ మాసంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవంతో పాటు కార్తికమాసంలో స్వామివారి జయంతి అత్యంత వైభవంగా జరుగుతాయి. దాతల సహకారంతో ఏడాది పొడువునా మహా అన్నదానం చేస్తున్నారు.
రామస్వామి గుట్టపైన వీరబ్రహ్మేం ద్ర స్వా మి ఆలయం నిర్మించడం సంకల్పంగా భావిస్తున్నా. ఇందుకోసం ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, దాత లు, స్వచ్ఛంద సంస్థల సహకారం అవసరం ఉంది. కాళేశ్వరం సమీపంలోని అజామ్నగర్లోని సరస్వతీ సంస్కృతి వేద పాఠశాలలో వేదాభ్యాసం పూర్తి చేశా. వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనతో పాటు గాయత్రిమాత ఆశ్ర మం నిర్వహిస్తున్నా. ఆశ్రమంలో అధ్యాత్మిక విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తక పఠనం, ఉచిత పంచాగ బోధన, ఆర్థిక స్థోమతను బట్టి అన్నప్రాసన, హోమాలు, యజ్ఞయాగాలు, గృహాప్రవేశాలు, వివాహాలు ఇతరత్రా పూజా కా ర్యక్రమాలు నిర్వహిస్తున్నా.