జైపూర్: ప్రభుత్వ ప్రాజెక్ట్లో రూ.1,140 కోట్లు నష్టం జరుగుతున్నదని బీజేపీ మంత్రి ఆరోపించారు. సొంత ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. ఆ ప్రాజెక్ట్ను నిలిపివేయాలని, ప్రతిపాదిత ఫైల్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. (Rajasthan Minister) ఆరు నెలల కిందట బీజేపీ అధికారంలోకి వచ్చిన రాజస్థాన్లో ఈ సంఘటన జరిగింది. సీఎం భజన్లాల్ శర్మ నిర్వహిస్తున్న హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్లో లోపాలపై వ్యవసాయ మంత్రి కిరోడి లాల్ మీనా ధ్వజమెత్తారు. గాంధీనగర్లో చేపట్టనున్న హౌసింగ్ ప్రాజెక్టు వల్ల ప్రభుత్వానికి రూ. 1,146 కోట్ల నష్టం వాటిల్లుతోందని అన్నారు. అక్కడి భూమి విలువను తక్కువగా పేర్కొనడం దీనికి కారణమని ఆరోపించారు.
కాగా, సీఎం ఆధ్వర్యంలోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (జీఏడీ), క్యాబినెట్ క్లియరెన్స్ లేకుండా ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకువెళ్తున్నారని మంత్రి మీనా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ను ఆపివేయాలని, ఆ ఫైల్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం భజన్లాల్ శర్మకు ఈ మేరకు ఆయన లేఖ రాశారు.
మరోవైపు సొంత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై బీజేపీ మంత్రి మీనా అభ్యంతరం వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు. గత నెలలో కూడా తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ కింద విక్రయించిన భూమిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందులో అవినీతి జరిగిందని ఆరోపించారు. స్పందించిన సీఎం ఆ ప్రాజెక్ట్పై చర్యలు తీసుకున్నారు.