రాజస్థాన్ యువనేత సచిన్ పైలట్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో భేటీ అయిన తర్వాత రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ సంచలన ప్రకటన చేశారు. తన రాజీనామా పత్రం ఎప్పుడూ సోనియా గాంధీ టేబుల్ మీదే వుంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్లో ముఖ్యమంత్రి మార్పు వుండబోతుందన్న వార్తల నేపథ్యంలో గెహ్లోత్ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.
”నా రాజీనామా పత్రం ఎప్పుడూ సోనియా గాంధీ దగ్గరే వుంటుంది. నా రాజీనామాపై ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు ఆమెకు వుంది. దయచేసి ఎలాంటి పుకార్లు మాత్రం వ్యాప్తి చేయకండని కోరుతున్నాను” అంటూ గెహ్లోత్ పేర్కొన్నారు.
పైలట్ భేటీ తర్వాత మారుతున్న సమీకరణాలు?
రాజస్థాన్లో సీఎం గెహ్లోత్, యువనేత సచిన్ పైలట్ మధ్య చాలా కాలం పాటు బహిరంగంగానే మాటల యుద్ధం నడిచింది. గెహ్లోత్పై యువనేత పైలట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ను అన్ని పదవుల నుంచి అధిష్ఠానం తప్పించింది.
దీని తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. కానీ… తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో పైలట్ భేటీ అయ్యారు. తనకు ముఖ్యమంత్రి పీఠం కావాలని నిర్మొహమాటంగా అధినేత్రికి చెప్పేశారు. ఈ సారి ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇవ్వాలని నేరుగా సోనియాకు నివేదించారు. ఈ సమావేశం తర్వాత సీఎం గెహ్లోత్ రాజీనామాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.