జైపూర్ : సరైన విచారణ చేపట్టకుండా నిందితుల ఇండ్లను కూల్చివేసే హక్కు ఎవరికీ లేదని బుల్డోజర్ న్యాయంపై రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ మండిపడ్డారు. బుల్డోజర్లతో ఇండ్లను నేలమట్టం చేసే అధికారం సీఎం, ప్రధాని సహా ఏ ఒక్కరికీ లేదని పేర్కొన్నారు. దర్యాప్తు చేపట్టకుండా నేరానికి బాధ్యులెవరో తేలకుండా ఇండ్లను ఎలా కూలుస్తారని సీఎం ప్రశ్నించారు. వ్యక్తి కండ్ల ముందే అతడి ఇంటిని పేక ముక్కలా కూల్చేసే అతడి మానసిక పరిస్దితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలని అన్నారు.
కరౌలి హింసాకాండకు సంబంధించి అమాయకులను అరెస్ట్ చేశారని విపక్షం చెబుతోందని, మరి వారు అరెస్టయిన కారణంగా రాజస్ధాన్ ప్రభుత్వం వారి ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేయాలా అని గెహ్లోత్ ప్రశ్నించారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చట్టాలను రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కి నిందితుల ఇండ్లపై బుల్డోజర్లతో విరుచుకుపడుతున్నాయని ఆరోపించారు. తమ ఇండ్లను కూల్చివేస్తుండగా ఆయా వ్యక్తులు నిస్తేజంతో అరుస్తున్న దృశ్యాలు టీవీల్లో ప్రసారమవుతున్నాయని చెప్పారు.
సరైన దర్యాప్తు చేపట్టకుండా వారి ఇండ్లను కూల్చివేసే హక్కు ఎవరికీ లేదని వారంతా పేదలని, బుల్డోజర్లతో ఇండ్లను కూల్చివేస్తుంటే వారు నిస్సహాయులై ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈడీ, ఐటీ అధికారులతో దాడులు జరిపించి వ్యవస్ధలను దుర్వినియోగం చేస్తున్నారని ఇలాంటి ప్రమాదకర పోకడలను యువత గమనించాలని, ఈ చర్యలకు కేంద్ర పాలకులు భారీ మూల్యం చెల్లిస్తారని సీఎం గెహ్లోత్ హెచ్చరించారు.