జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రిని మార్చనున్నారనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం అధికార కాంగ్రెస్ శాసనసభాపక్ష (CLP) సమావేశం నేడు జరుగనుంది. సీఎం గెహ్లాట్ అధికార నివాసంలో జరుగుతున్న ఈ భేటీకి ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా హాజరవ్వాలని ఇప్పటికే సమాచారం అందించారు. గత మంగళవారమే సీఎల్పీ సమావేశం జరిగింది. వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి భేటీ జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకున్నది.
కాగా, నేటి సీఎల్పీ సమావేశానికి పరిశీలకుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నియమించారు. ఖర్గేతోపాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి అజయ్ మాకెన్ కూడా ఈ సమావేశానికి హాజరవుతారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
సీఎం మార్పు తథ్యమన్న వార్తల నేపథ్యంలో సీనియర్ నేత సచిన్ పైలట్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషితో సమావేశమయ్యారు. ఇప్పటికే ఆయన ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకున్నారు. బీఎస్పీ నుంచి కాంగ్రెస్లో విలీనమైన ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా సచిన్ సీఎం అభ్యర్థిత్వంపై సానుకూలంగా ఉన్నారు. గెహ్లాట్ పార్టీ అధ్యక్షుడిగా వెళ్లినపక్షంలో.. సచిన్ ముఖ్యమంత్రి అయితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మంత్రి రాజేంద్ర గుధా స్పష్టం చేశారు.