జైపూర్: రాజస్థాన్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజా ఆంక్షలకు సంబంధించిన మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేసింది. వారాంతపు కర్ఫ్యూ విధించింది. శనివారం రాత్రి 11 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఇది అమలులో ఉంటుందని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న రాత్రి కర్ఫ్యూ కూడా కొనసాగుతుందని సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం పేర్కోంది.
మరోవైపు 12వ తరగతి వరకు అన్ని మున్సిపల్, కార్పొరేషన్ ప్రాంతాల్లో ప్రత్యక్ష బోధనను ఈ నెల 30 వరకు నిలిపివేశారు. అయితే ఆన్లైన్ శిక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మతపరమైన ప్రదేశాలు ఉదయం 5:00 నుండి రాత్రి 8:00 వరకు తెరిచి ఉంటాయని చెప్పారు.
రెస్టారెంట్లు, క్లబ్బులు 50 శాతం సామర్థ్యంతో రాత్రి 10:00 గంటల వరకు, సినిమా హాళ్లు, థియేటర్లు, మల్టీప్లెక్స్లు 50 శాతం కన్నా తక్కువ సామర్థ్యంతో రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయని అధికారులు తెలిపారు. రాత్రి 8:00 గంటల వరకు వాణిజ్య సంస్థలు తెరిచి ఉంచేందుకు అనుమతించినట్లు వెల్లడించారు.