ఢిల్లీ ఎయిర్పోర్టులో అసౌకర్యంపై రాజమౌళి ట్వీట్
న్యూఢిల్లీ, జూలై 2: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు కనీస వసతులు కల్పించకపోవడంపై సినీ దర్శకుడు రాజమౌళి అసహనం వ్యక్తం చేశారు. కరోనా టెస్టు వివరాలను పత్రాల్లో నింపేందుకు వీలుగా కనీసం బల్లలు కూడా ఏర్పాటు చేయలేదని, ప్రయాణికులంతా కింద కూర్చొని పేపర్లు నేలపై పెట్టి, గోడకు ఆనించి వివరాలను నింపాల్సి వచ్చిందని అన్నారు. విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లే మార్గంలో వీధి కుక్కలు యథేచ్చగా తిరుగుతున్నాయని తెలిపారు. అధికారులు దృష్టి సారించాలని కోరుతూ ట్వీట్ చేశారు. దీనిపై ఢిల్లీ విమానాశ్రయ నిర్వహణ అధికారులు స్పందించారు. సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల వివరాలు నింపడానికి డెస్కులు ఏర్పాటు చేశామని, మరిన్ని డెస్కులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున రాజమౌళి ఎయిర్పోర్టుకు చేరుకొన్నారు.