న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నిన్నటి వరకు ఎండలు దంచికొట్టిన విషయం తెలిసిందే. దీంతో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సోమవారం ఉదయం ఢిల్లీలో భారీ వర్షం కురియడంతో.. ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం లభించింది. తెల్లవారుజామున 5:40 నుంచి 7 గంటల వరకు వర్షం కురిసింది. ఈ సమయంలో 11 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అంటే 29 డిగ్రీల నుంచి 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో రెండు గంటల పాటు ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇక ఉదయం కురిసిన వానకు ఢిల్లీ తడిసి ముద్దైంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. బలమైన గాలులు వీచడం వల్ల పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ క్రమంలో ప్రయాణికులు తమ సంబంధిత ఎయిర్లైన్ను సంప్రందించాలని ఎయిర్పోర్టు వర్గాలు సూచించాయి.