న్యూఢిల్లీ, జూలై 21: మేకిన్ ఇండియా అంటూ గప్పాలు కొట్టే మోదీ ప్రభుత్వం.. తాజాగా మరో విదేశీ కంపెనీకి రైలుచక్రాల తయారీ కాంట్రాక్టును కట్టబెట్టింది. చైనా వస్తువులను బహిష్కరించాలని చెప్పే మోదీ ప్రభుత్వం.. భారతీయ రైల్వే కోసం భారీ సంఖ్యలో వీల్స్ను (చక్రాలను) కొనుగోలు చేసేందుకు అదే చైనాలోని ఓ కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. దేశీయ రైల్వేల్లోని ఎల్హెచ్బీ (లింక్-హాఫ్మన్-బుష్) కోచ్ల కోసం 39 వేల వీల్స్ను కొనుగోలు చేసేందుకు చైనా సంస్థ తైయువాన్కు ఆర్డర్ ఇచ్చినట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు.
గతంలో ఈ వీల్స్ను ఉక్రెయిన్ నుంచి కొనుగోలు చేయాలని భావించామని, ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో తలెత్తిన సంక్షోభం వల్ల సరఫరాలకు విఘాతం కలగడంతో చైనా కంపెనీకి ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంస్థతో కుదుర్చుకొన్న ఒప్పందంలోని ధర కంటే 1.68% అధిక ధరతో చైనా కంపెనీ నుంచి వీల్స్ను కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు.