న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. నిరసనకారులు పెద్ద ఎత్తున రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. గత కొద్ది రోజులుగా రైళ్లను రద్దు చేసినందుకు ప్రయాణికులకు రీయింబర్స్మెంట్తో సహా భారతీయ రైల్వే ఇప్పటి వరకు రూ.1000కోట్లకుపైగా నష్టాన్ని చవిచూసింది. ఆందోళనకారులు రైల్వే ఆస్తులను సైతం ధ్వంసం చేయడంతో పాటు డజనుకుపైగా రైళ్లను తగులబెట్టారు. జూన్ 18 వరకు నాలుగు రోజుల్లోనే నిరసనలతో రూ.700కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని రైల్వే పేర్కొంది. 60కోట్లకుపైగా ప్రయాణికుల టికెట్లు రద్దయ్యాయి. రైల్వేకు గత కొద్ది రోజుల్లోనే జరిగిన ఆస్తి నష్టం దశాబ్దకాలంలో జరుగలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక జనరల్ కోచ్ నిర్మాణానికి రూ.80 లక్షలు, స్లీపర్ కోచ్, ఏసీ కోచ్కు యూనిట్కు వరుసగా రూ.1.25 కోట్లు, రూ.3.5 కోట్లు ఖర్చవుతుంది. రైలు ఇంజిన్ తయారీకి రూ.20కోట్లకుపైగానే వెచ్చించాల్సి ఉంటుంది. 12 కోచ్ల ప్యాసింజర్ రైలు ధర రూ.40 కోట్లు, 24 కోచ్ల రైలు ధర రూ.70 కోట్లకుపైనే ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. దేశంలో నిరసనలైనా, ఉద్యమాలైనా తరుచూ రైల్వే ఆస్తులే విధ్వంసానికి గురవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఆర్ఆర్బీ-ఎన్టీపీసీ పరీక్షల అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. రైల్వే మంత్రిత్వశాఖ డేటా ప్రకారం.. 2020-21లో నిరసనల కారణంగా రైల్వే రూ.456.20కోట్లకుపైగా నష్టాన్ని చవిచూసింది. 2019-20లో రూ.100కోట్లకుపైగా నష్టాన్ని చవిచూసింది.
రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం చట్టరీత్యా నేరం. నేరం రుజువైతే ఐదు సంవత్సరాల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది. రైల్వే చట్టం ప్రకారం.. ఎవరైనా ఏదైనా రైల్వే ఆస్తికి నిప్పంటించడం, ఏదైనా పద్ధతిలో ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగిస్తే అతను ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జరిమానాతో పాటు శిక్షణ పడే అవకాశాలూ లేకపోలేదు. రైల్వే ట్రాక్లు, వంతెనలు, స్టేషన్ భవనాలు, క్యారేజీలు, లోకోమోటివ్లు, సిగ్నల్ సిస్టమ్స్, ఎలక్ట్రిక్ ట్రాక్షన్, టెలికమ్యూనికేషన్ సిస్టమ్ రైల్వే ఆస్తులు.