Special Trains | భారతీయ రైల్వే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక రైళ్ల ద్వారా రూ.17,526.48కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ ఆదాయం ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ప్రయాణికుల ఆదాయంలో 45శాతం. చంద్రశేఖర్ గౌర్ అనే వ్యక్తి చేసిన ఆర్టీఐ కింద దరఖాస్తు చేయగా.. రైల్వేశాఖ ఈ సమాచారం ఇచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక రైళ్లతో రూ.804.78కోట్ల ఆదాయం వచ్చిందని రైల్వేశాఖ తెలిపింది.
కరోనా మహమ్మారి సమయంలో ఈ మొత్తం 2020-21 నాటికి రూ.12,02,7.81 కోట్లకు చేరింది. 2021-22 సంవత్సరంలో నాటికి మరింత పెరిగి రూ. 17,526.48 కోట్ల ఆదాయాన్ని రైల్వే ఆర్జించింది. 2019-20లో ప్రయాణీకుల టిక్కెట్ల విక్రయం ద్వారా రైల్వేశాఖ మొత్తం రూ.50,669.09 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నది. కరోనా మహమ్మారి ప్రభావంతో ఆ తర్వాత ఏడాది రూ.15,248.49 కోట్లకు పడిపోయింది. సాధారణంగా పండుగ రోజులు, జాతీయ స్థాయిలో పరీక్షలు, ప్రత్యేక సమయాల్లో మాత్రమే రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. కరోనా మహమ్మారి నుంచి రైళ్లను ‘ప్రత్యేక ట్యాగ్తో భారతీయ రైల్వే నడిపించింది.
కరోనా మహమ్మారి అనంతరం నవంబర్ 2021లో కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరాయి. మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడంతో 2021-22లో నాలుగు త్రైమాసికల్లో ప్యాసింజర్ రైళ్ల ఆదాయం కూడా గణనీయంగా పెరిగినట్లు ఆర్టీఐ దరఖాస్తుకు రైల్వే ఇచ్చిన సమాచారంతో తేలింది. 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రయాణికుల ద్వారా రూ. 4,921.11 కోట్లు, రెండో త్రైమాసికంలో రూ.10,513 కోట్లు, మూడో త్రైమాసికంలో రూ.11,873 కోట్లు కాగా.. చివరి త్రైమాసికంలో రూ.11,796.81 కోట్లతో మొత్తంగా రూ.39,104.41 కోట్లకు ఆదాయం చేరుకున్నది.