ముందే అలర్ట్ చేసే సేవలు ప్రారంభించిన రైల్వే
న్యూఢిల్లీ, జూన్ 5: రైలులో ప్రయాణం అంటే కాస్త టెన్షన్ ఉంటుంది.. ఎక్కే వరకు సరే కానీ దిగేటప్పుడే మనం దిగాల్సిన స్టేషన్ వచ్చిందా లేదా అని కంగారు తప్పదు. ఇక రాత్రిపూట పడుకుందామంటే స్టేషన్ ఎక్కడ వెళ్లిపోతుందోనన్న టెన్షన్. చిన్న కునుకు పట్టిందో అంతే సంగతులు.. అందుకే భారతీయ రైల్వే ‘డెస్టినేషన్ అలర్ట్ వేకప్ అలారం’ పేరిట కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీంట్లో భాగంగా దిగాల్సిన స్టేషన్ రావడానికి 20 నిమిషాల ముందు మీ ఫోన్కు అలర్ట్ వస్తుంది. ఈ సేవల కోసం 139 నంబర్కు కాల్ లేదా మెసేజ్ ద్వారా మీ పీఎన్ఆర్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత గమ్యస్థానానికి 20 నిమిషాల ముందు మీకు ఐఆర్సీటీసీ నుంచి ఫోన్ వస్తుంది. ఈ సేవలను వినియోగించుకున్నందుకు ప్రతి ఎస్ఎంఎస్కు రూ.3 చార్జి పడుతుంది. రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటల మధ్య ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. కాగా, జూలై 1 నుంచి టికెట్ బుకింగ్ సమయంలో వెయిటింగ్ లిస్టును రైల్వేశాఖ తొలగించనున్నది.