న్యూఢిల్లీ, మే 13: ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామంటూ కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం కొత్త ఉద్యోగాల సృష్టి సంగతి అటుంచితే రైల్వేలో ఉన్న ఉద్యోగాలకే కోత పెట్టింది. ఆరేండ్లలో 72వేల పోస్టులను రద్దు చేసింది. వాస్తవానికి కేంద్రం ప్రభుత్వం 81వేల పోస్టులను రద్దు చేయాలని తొలుత ప్రతిపాదన చేసింది.
రైల్వేలో రద్దు చేసిన పోస్టులు అన్నీ గ్రూప్ సీ, గ్రూప్ డీ పోస్టులే. పెరుగుతున్న సాంకేతికత కారణంగా ఆయా పోస్టుల్లో మానవ శ్రమ అక్కర్లేదన్న సాకుతో ఈ ఉద్యోగాలను రద్దుచేసింది. ఇప్పటికే ఈ పోస్టుల్లో పనిచేస్తున్న వారిని రైల్వేలోనే వేరే విభాగాల్లో సర్దుబాటు చేయనున్నారు. అధికారిక వివరాల ప్రకారం.. 16 జోనల్ రైల్వేలు 56,888 ఉద్యోగాలను ‘అంతగా ప్రాధాన్యం లేని’ పోస్టుల జాబితాలో చేర్చి రద్దు చేశాయి. మరో 15,495 పోస్టులను రద్దు చేయాలని నిర్ణయించాయి.