కరోనా అన్ని రంగాలనూ దెబ్బతీసింది. ఆ కోవలోకే రైల్వే కూడా వచ్చి చేరుతుంది. చాలా రోజల పాటు రైళ్లు నడవనే లేదు. దీంతో ఆదాయం ఘోరంగా పడిపోయింది. కొన్ని రోజుల తర్వాత ప్రజలను తమ స్వస్థలాలకు చేర్చడానికి కేంద్రం కొన్ని ప్రత్యేక రైళ్లను నడిపింది. వాటి వల్ల కూడా రైల్వేలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఇప్పుడిప్పుడు కాస్త రైల్వే ఆదాయం పట్టాలెక్కుతోంది. సరిగ్గా ఇదే సమయంలో రైల్వే అధికారులు కూడా మేల్కొంటున్నారు. తమ జూలును విదుల్చుతున్నారు. ట్రైన్లలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.
అధికారులు బృందాలుగా విడిపోయి, తనిఖీలు చేస్తున్నారు. దీంతో టిక్కెట్ లేని ప్రయాణికులు ఇట్టే దొరికిపోతున్నారు. వారి నుంచి భారీగా జరిమానాలు వసూలు చేస్తున్నారు. కేవలం ఆరు నెలల్లోనే 100 కోట్ల ఆదాయం రైల్వేకు సమకూరిందని అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్ నెల మొదలు డిసెంబర్ 5 తారీఖు వరకూ విస్తృతంగా తనిఖీలు చేపట్టామని, టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారి నుంచి జరిమానాలు వసూలు చేశామని రైల్వే అధికారులు ప్రకటించారు.