Indian Railway | కుంభమేళా కోసం పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నది. కుంభమేళా సందర్భంగా 992 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరుగనున్నది. ప్రత్యేక రైళ్లను నడపడంతో పాటు వివిధ మౌలిక సదుపాయాలు, ప్రయాణికులకు సౌకర్యాల కల్పన కోసం మంత్రిత్వశాఖ రూ.933 కోట్లను సైతం కేటాయించింది. ప్రస్తుతం రైల్వే ట్రాక్ డబ్లింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కుంభమేళా కోసం ప్రయాగ్రాజ్ డివిజన్, పరిసర ప్రాంతాల్లోనూ రైళ్ల రాకపోకలు సాఫీగా సాగేందుకు రూ.3,700 కోట్లతో రైల్వే ట్రాక్ డబ్లింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
జనవరి 12 నుంచి ప్రారంభమయ్యే కుంభమేళా సందర్భంగా భారీ సంఖ్యలో భక్తుల రద్దీని ఎదుర్కొనేందుకు ఏర్పాట్లను సమీక్షించేందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు రవ్నీత్ సింగ్ బిట్టు, వీ సోమన్న సమావేశాలు నిర్వహించారు. సన్నాహాలను పరిశీలించేందుకు ఉత్తర రైల్వే, ఉత్తర మధ్య రైల్వే, ఈశాన్య రైల్వే జోన్లకు చెందిన జనరల్ మేనేజర్లు సహా సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కుంభమేళాకు 30 నుంచి 50కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. వివిధ నగరాల నుంచి ప్రయాగ్రాజ్కు 6,580 సాధారణ రైళ్లతో పాటు 992 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. సీనియర్ రైల్వే అధికారి మాట్లాడుతూ 2019లో జరిగిన కుంభమేళాకు 24 కోట్ల మందికిపైగా ప్రజలు హాజరయ్యారని తెలిపారు. ఆ సమయంలో 5వేల సాధారణ, అదనంగా 694 ప్రత్యేక రైళ్లను నడిపించినట్లు తెలిపారు.
ప్రస్తుతం ప్రత్యేక రైళ్ల సంఖ్యను 42శాతం పెంచి 992 నడిపించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇంకా రైళ్లను పెంచాల్సిన అవసరం ఉంటే.. బ్యాకప్ ప్లాన్తో సిద్ధంగా ఉన్నామన్నారు. వివిధ ఓవర్ బ్రిడ్జి పనులకు సుమారు రూ.440 కోట్లు ఖర్చ చేయనున్నట్లు మరో అధికారి తెలిపారు. మిగతా రూ.495కోట్లతో స్టేషన్లకు వెళ్లే రోడ్ల మరమ్మతులు, ప్లాట్ఫారమ్లు, చుట్టుపక్కల సీసీ కెమెరాల ఏర్పాటు, స్టేషన్లలో వెయిటింగ్ హాల్స్తో పాటు ప్రయాణికుల కోసం అదనపు వసతి యూనిట్లు, వైద్య సదుపాయాలు తదితర కార్యకలాపాల కోసం వెచ్చించనున్నట్లు తెలిపారు. వారణాసి-ఝూన్సీల మధ్య రైల్వే లైన్ల డబ్లింగ్ పూర్తయ్యిందని.. ప్రయాగ్రాజ్-రాంబాగ్-ఝూన్సీ, జంఘై-ఫఫమౌ లైన్లు కుంభమేళాకు ముందే సిద్ధం చేస్తామని అధికారులు వివరించారు.