న్యూఢిల్లీ: రైలులో ప్రయాణించిన బాలిక పట్ల రైల్వే ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ వేధింపులపై తన కుటుంబానికి ఆ బాలిక ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన బాలిక కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు ఆ వ్యక్తిని కొట్టి చంపారు. (Railway Employee Beaten To Death) బీహార్లోని బరౌని నుంచి ఢిల్లీకి వెళ్లే హమ్సఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఈ సంఘటన జరిగింది. బీహార్లోని సివాన్కు చెందిన ఒక కుటుంబం ఈ రైలులోని థర్డ్ ఏసీ కోచ్లో బుధవారం ప్రయాణించింది. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా సమస్త్పూర్ గ్రామానికి చెందిన గ్రూప్ డీ రైల్వే ఉద్యోగి ప్రశాంత్ కుమార్ కూడా ఆ కోచ్లో ప్రయాణించాడు. ఆ కుటుంబానికి చెందిన 11 ఏళ్ల బాలికను తన సీటు వద్ద కూర్చొబెట్టుకున్నాడు. బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో బాలిక తల్లి వాష్రూమ్కు వెళ్లగా ఆ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.
కాగా, వాష్రూమ్ నుంచి తిరిగి వచ్చిన తల్లిని పట్టుకుని ఆ బాలిక బోరున ఏడ్చింది. తల్లిని వాష్రూమ్ వద్దకు తీసుకెళ్లి జరిగిన విషయం చెప్పింది. దీంతో రైల్వే ఉద్యోగి ప్రశాంత్ కుమార్ ప్రవర్తనపై ఆ మహిళ తన భర్త, మామతోపాటు కోచ్లోని ఇతర ప్రయాణికులకు చెప్పింది. దీంతో అతడ్ని ఆ కోచ్ డోర్ వద్దకు తీసుకెళ్లారు. కదులుతున్న రైలులో పలు గంటలపాటు కొట్టారు.
మరోవైపు గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ సెంట్రల్ స్టేషన్కు ఆ రైలు చేరింది. దీంతో కోచ్ వద్దకు చేరకున్న ప్రభుత్వ రైల్వే పోలీసులకు ప్రశాంత్ కుమార్ను అప్పగించారు. బాలికను వేధించినట్లు అతడిపై ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని రైల్వే పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
కాగా, బాలిక కుటుంబం, ఇతర ప్రయాణికులు కుట్రతో ప్రశాంత్ కుమార్ను హత్య చేసినట్లు అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.