న్యూఢిల్లీ, డిసెంబర్ 27: త్వరలో ప్రారంభం కానున్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో కనీస చార్జీని రూ.35గా రైల్వే బోర్డు నిర్ణయించింది. 1 నుంచి 50 కిలోమీటర్లలోపు ఈ చార్జీని వసూలు చేస్తారు. సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ ప్రయాణాలకు ఈ చార్జీని నిర్ణయించారు. టికెట్ ధరకు రిజర్వేషన్ ఫీజు, ఇతర చార్జీలు అదనంగా ఉంటాయని అన్ని రైల్వే జోన్లకు రైల్వే బోర్డు జారీచేసిన టికెట్ ధరల పట్టికలో పేర్కొన్నారు. ఈ నెల 30న అయోధ్యలో ప్రధాని నరేంద్రమోదీ తొలి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. రైల్వే బోర్డు ప్రకటించిన ఈ ధరలు ప్రస్తుతం నడుస్తున్న ఎక్స్ప్రెస్ రైళ్ల టికెట్ ధరలతో పోల్చితే 15 నుంచి 17 శాతం అధికంగా ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు. అమృత్ భారత్ రైళ్లలో సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ బోగీలు మాత్రమే ఉంటాయి. జనరల్ బోగీలు ఉండవు. ఈ రైళ్లలో కన్సెషనల్ టికెట్లు, కాంప్లిమెంటరీ పాసులు చెల్లుబాటు కావని రైల్వే అధికారులు తెలిపారు.