న్యూఢిల్లీ: ఆసుపత్రిలో ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ సోమవారం కలిశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సమన్ల నేపథ్యంలో భారీ ర్యాలీగా ఈడీ కార్యాలయానికి సోమవారం హాజరైన రాహుల్ గాంధీని ఈడీ అధికారులు సుమారు మూడు గంటలు ప్రశ్నించారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, యంగ్ ఇండియా లిమిటెడ్తో రాహుల్కు సంబంధాలు, ఆయన పేరుపై ఉన్న షేర్ల వివరాలు, గత షేర్ హోల్డర్లతో సంబంధాలు, సమావేశాలు, యంగ్ ఇండియాకు కాంగ్రెస్ రుణాలు, నేషనల్ హెరాల్డ్ పునరుద్ధరణపై కాంగ్రెస్ నిర్ణయం, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, నేషనల్ హెరాల్డ్ ఆస్తులు, నిధుల బదిలీల వివరాలను ఈడీ అడిగినట్లు సమాచారం.
అనంతరం ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన రాహుల్ గాంధీ, సోదరి ప్రియాంక గాంధీతో కలిసి సోనియా చికిత్స పొందుతున్న గంగా రామ్ హాస్పిటల్కు వెళ్లారు. తల్లిని కలిసి పరామర్శించారు. భోజన విరామం తర్వాత తిరిగి ఈడీ కార్యాలయానికి వెళ్లిన రాహుల్ను అధికారులు ప్రశ్నిస్తున్నారు.
కాగా, సోనియా గాంధీ కరోనా సంబంధ అనారోగ్య సమస్యలతో ఆదివారం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రశ్నించేందుకు ఈ నెల 8న హాజరుకావాలంటూ ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసింది. గత నెల చివర్లో ఆమె కరోనా బారిన పడటంతో ఈడీ కార్యాలయానికి హాజరుకాలేదు. కరోనా సోకడంతో మూడు వారాల గడువు కోరారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23న హాజరు కావాలంటూ ఈడీ తాజాగా సోనియా గాంధీకి సమన్లు జారీ చేసింది.