గువాహటి: అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలను మరింత తీవ్రం చేస్తున్నారు. తాజాగా రాహుల్ను జిన్నాతో పోల్చారు. రాహుల్ గాంధీ ఆధునిక జిన్నా అని విమర్శించారు. రాహుల్ గాంధీలోకి జిన్నా దెయ్యం ప్రవేశించిందని అన్నారు. ఆయన భాష 1947కు ముందు జిన్నా మాదిరిగా ఉందని శనివారం ఆరోపించారు.
గత పది రోజులుగా రాహుల్ గాంధీ చేస్తున్న ప్రసంగాలను తాను గమనిస్తున్నానని హిమంత బిస్వా శర్మ తెలిపారు. భారత దేశం రాష్ట్రాల సమాఖ్య అని ఒకసారి, ఇండియా అంటే గుజరాత్ నుంచి బెంగాల్ దాకా అని ఇంకోసారి అన్నారని చెప్పారు. అంటే గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు మాత్రమే భారత దేశంగా ఆయనకు అనిపిస్తుందని విమర్శించారు. ఆ విధంగా, రాహుల్ గాంధీ ఆధునిక జిన్నా అని వ్యాఖ్యానించారు.
కాగా, బీజేపీ నేత అయిన హిమంత బిస్వా శర్మ శుక్రవారం రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తండ్రి రాజీవ్ గాంధీయేనా, రాహుల్ ఆయన కుమారుడేనా అని బీజేపీ ఎప్పుడైనా ప్రశ్నించిందా అని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్పై ఆధారాలు కోరిన రాహుల్ గాంధీపై ఈ మేరకు విమర్శలు చేశారు. అయితే హిమంత బిస్వా శర్మ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్తో సహా పలువురు నేతలు దీనిని ఖండించారు.