న్యూఢిల్లీ : భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆహ్వానం పంపారు. రాహుల్ లేఖకు అఖిల్ యాదవ్ బదులిస్తూ.. ట్విట్టర్లోనూ షేర్ చేశారు. ఇంతకు ముందు అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ రాహుల్ నుంచి తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని, ఈ కారణంగా భారత్ జోడో యాత్రలో పాల్గొనబోనని ప్రకటించారు. తాజాగా రాహుల్ ఆహ్వానం పంపడంపై హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
‘రాహుల్ జీ ఆహ్వానం పంపినందుకు ధన్యవాదాలు. భారత్ జోడో యాత్ర కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నందుకు శుభాకాంక్షలు. భారతదేశం అనేది భౌగోళిక విస్తరణ కంటే ఎక్కువ అనుభూతి అని, ఇందులో ప్రేమ, అహింస, కరుణ, సహకారం.. సామరస్యం మాత్రమే భారతదేశాన్ని ఏకం చేసే సానుకూల అంశాలు’ అని అఖిలేశ్ పేర్కొన్నారు. దేశంలోని ఈ సమగ్ర సంస్కృతిని పరిరక్షించే లక్ష్యంతో రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర లక్ష్యం సాధిస్తుందని ఆశిస్తున్నానన్న అఖిలేశ్.. యాత్రలో పాల్గొంటారా? లేదా? అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.