న్యూఢిల్లీ, ఆగస్టు 4: మోదీ ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. సూరత్ కోర్టు విధించిన రెండేండ్ల శిక్షపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. ట్రయల్ కోర్టు తీర్పును ధర్మాసనం తప్పుబట్టింది. పరువు నష్టం కేసులో రాహుల్కు గరిష్ఠ శిక్ష విధింపునకు జడ్జి కారణాలు చూపలేదని పేర్కొన్నది. తీర్పుపై రాహుల్ స్పందిస్తూ ‘నా కర్తవ్యం ఒకటే. అది దేశ సిద్ధాంతాలను రక్షించడమే’ అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాహుల్ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. ఆయన ఎంపీ సభ్యత్వాన్ని స్పీకర్ పునరుద్ధరించవచ్చు లేదా రాహుల్ తన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని కోరేందుకు అవకాశం ఉన్నది.