Rahul Gandhi : భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమ బెంగాల్లో ప్రవేశించింది. బిహార్లోని కతిహార్ నుంచి యాత్ర బుధవారం ఉదయం రాష్ట్రంలోని మాల్ధా జిల్లాలోకి ఎంటరైంది. యాత్రలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న వాహనంపై దాడికి దిగిన దుండగుడు కారు కిటికీ అద్దాలను ధ్వంసం చేశాడని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి ఆరోపించారు. ఈ ఘటనలో రాహుల్ గాంధీ క్షేమంగా బయటపడ్డారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఘటనా స్ధలంలో రాహుల్ ఎస్యూవీ నుంచి దిగి పగిలిన కిటికీ అద్దాలను పరిశీలించారు. రాహుల్ కారుపైకి ఎక్కి జనానికి అభివాదం చేస్తుండగా వెనుక నుంచి ఓ వ్యక్తి రాయి విసిరిఉంటాడని అధిర్ రంజన్ చెప్పారు. పోలీసులు ఈ ఘటన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని, పోలీసులు ఇలాగే వ్యవహరిస్తే ఏమైనా జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది చిన్న ఘటనేనని, కానీ మరెలాంటి ఘటనైనా జరగవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. తమ కారు కిటికీ పగలకొట్టినా తమ యాత్రను ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని, ఇండియా కూటమి ఎన్నటికి తలవంచదని అన్నారు. మరోవైపు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా బుధవారం మాల్ధాలోని ఇంగ్లీష్ బజార్ నుంచి జనసంయోగ్ యాత్రను తలపెట్టడం గమనార్హం. మమతా బెనర్జీ పర్యటన నేపధ్యంలో మాల్ధా జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Read More :