Himanta Sarma-Rahul Gandhi | విపక్ష ఇండియా కూటమిపైనా, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీపైన అసోం సీఎం హేమంత బిశ్వశర్మ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే, చంద్రుడి వద్దకు ప్రయాణం చేయాలన్నారు. బీహార్లోని నలందా విశ్వవిద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన వైశాలీ ఉత్సవ్ కార్యక్రమంలో హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. ‘ప్రధానమంత్రి కావాలంటే చంద్రుడి వద్దకు రాహుల్ గాంధీ ప్రయాణం చేయాలి. ఒకవేళ ప్రధాని కావాలని రాహుల్ కోరుకుంటే, అప్పుడు నేను ఆయన్ను చంద్రయాన్ ద్వారా చంద్రుడిపైకి పంపుతా.. అక్కడ ఆయన ప్రధానమంత్రి అవుతారు’ అని ఎద్దేవా చేశారు.
‘ఇండియా కూటమి తరఫున ప్రధాని అయ్యేందుకు బీహార్ సీఎం నితీశ్ కుమార్కు కూటమిలోనే ఆశల్లేవు. ఆయన ఒంటరివాడవుతారు’ అని హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. ‘ఇండియా కూటమి సమావేశాల గురించి వచ్చిన సమాచారం ఆధారంగా చెబుతున్నా.. ఆ ఇండియా కూటమి కన్వీనర్ కూడా కాదు నితీశ్ కుమార్. భారత్ ప్రధానిగా నరేంద్రమోదీ ఉన్నారు. కానీ నితీశ్ మీద ఆశల్లేవు. కూటమిలో ఆయన ఒంటరి అవుతారు` అని చెప్పుకొచ్చారు.
సనాతన ధర్మం వివాదంపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉందని హిమంత బిశ్వ శర్మ ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ వైఖరేమిటన్నారు. 80 శాతం భారతీయుల విశ్వాసాలపై దాడి జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఏమీ మాట్లాడటం లేదంటే.. దాని వెనుక ఉన్నదే ఆ పార్టీ’ అని చెప్పారు.