Rahul Gandhi | అధికార బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమితో పోరాడేందుకు లోక్సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపడతానని తెలిపారు. ఇంతకుముందే లోక్సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీర్మానించింది. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. ఈ నిర్ణయాన్ని లోక్ సభ ప్రొటెం స్పీకర్ భర్తృహరికి లేఖ ద్వారా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ తెలిపినట్లు సమాచారం. 18వ లోక్ సభ తొలి సమావేశాల్లో స్పీకర్ ఎన్నికకు కొన్ని గంటల ముందు రాహుల్ గాంధీ విపక్ష నేతగా వ్యవహరించనున్నట్లు ప్రకటించడం గమనార్హం.
లోక్ సభ స్పీకర్ పదవికి ఏకాభిప్రాయంతో ఎన్నిక జరుగడం సంప్రదాయంగా వస్తోంది. ప్రతిపక్ష నేతకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారు. కానీ విపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలన్న ప్రతిపాదనను అధికార ఎన్డీఏ కూటమి తిరస్కరించడంతో స్పీకర్ పదవికి పోటీ అనివార్యమైంది. బీజేపీ నుంచి మాజీ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ పార్టీ నుంచి కే సురేశ్ స్పీకర్ పదవి కోసం పోటీ పడుతున్నారు. బుధవారం లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నికలు జరుగుతాయి. దశాబ్దాలుగా లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరుగనుండటం ఇదే తొలిసారి. అధికార ఎన్డీఏ కూటమికి 292 మంది సభ్యుల మద్దతుతోపాటు వైఎస్ జగన్ సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నలుగురు కూడా మద్దతు పలికారు.
ఇక తొలి నుంచి ప్రభుత్వంపై పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ నేతగా రాహుల్ గాంధీ.. విపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించడం 2014 ఎన్నికల తర్వాత ఇదే తొలిసారి. 2014 ఎన్నికల్లో విపక్ష నేత హోదా పొందాలంటే కనీసం కాంగ్రెస్ పార్టీ 52 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంది. కానీ 2014, 2019 ఎన్నికల్లో ఆ మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా ఉండటంతో లోక్ సభలో విపక్ష నేత హోదాకు కాంగ్రెస్ పార్టీ దూరమైంది. లోక్ సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీకి క్యాబినెట్ మంత్రి ర్యాంక్ లభిస్తుంది. అలాగే పార్లమెంట్ లో ప్రజల సమస్యలను ప్రస్తావించేందుకు రాహుల్ గాంధీకి అవకాశం లభిస్తుంది. గత దశాబ్ద కాలంలో ఇండియా బ్లాక్ శక్తిమంతంగా రూపుదిద్దుకున్నది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, కమిషనర్ల ఎంపిక వంటి కమిటీల్లో ప్రధాని నరేంద్రమోదీతోపాటు రాహుల్ గాంధీకి చోటు లభిస్తుంది.