న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మూడు గంటలపాటు ప్రశ్నించింది. నేషనల్ హెరాల్డ్ కేసుపై దర్యాప్తులో భాగంగా ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. దీంతో రాహుల్ గాంధీ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా సోమవారం ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఈడీ అధికారులు ఆయనను సుమారు మూడు గంటల పాటు ప్రశ్నించారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, యంగ్ ఇండియా లిమిటెడ్తో రాహుల్కు సంబంధాలు, ఆయన పేరుపై ఉన్న షేర్ల వివరాలు, గత షేర్ హోల్డర్లతో సంబంధాలు, సమావేశాలు, యంగ్ ఇండియాకు కాంగ్రెస్ రుణాలు, నేషనల్ హెరాల్డ్ పునరుద్ధరణపై కాంగ్రెస్ నిర్ణయం, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, నేషనల్ హెరాల్డ్ ఆస్తులు, నిధుల బదిలీల వివరాలను ఈడీ అడిగినట్లు సమాచారం.
కాగా, మూడు గంటల ఈడీ విచారణ తర్వాత రాహుల్ గాంధీ ఆ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. అనంతరం కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు సత్యాగ్రహ ర్యాలీలో పాల్గొన్న అధిర్ రంజన్ చౌదరి, కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తదితర కాంగ్రెస్ సీనియర్ నేతలతోపాటు పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్కు తరలించిన కాంగ్రెస్ సీనియర్ నేతలను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కలిశారు. అయితే కాంగ్రెస్ ఎంపీ అధిర్ చౌదరి, కేసీ వేణుగోపాల్పై పోలీసులు చేయి చేసుకోవడంపై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశ పెడతామని ఆ పార్టీ నేత తెలిపారు.