న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్, గ్యాస్ సహా నిత్యావసరాల ధరల మోతపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం మోదీ సర్కార్ తీరును దుయ్యబట్టారు. దేశ ఆర్ధిక పరిస్ధితి ఊహించలేనివిధంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి వ్యవస్ధను ధ్వంసం చేశారని మండిపడ్డారు. బీజేపీ, ఆరెస్సెస్లు వాస్తవాలను మరుగునపడేస్తున్నాయని అన్నారు.
వాస్తవాలు క్రమంగా వెలుగులోకి వస్తాయని ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్నది అదేనని పేర్కొన్నారు. గతంలో భారత్ ఒక్కతాటిపై నిలిచేదని ఇప్పుడు దేశాన్ని పాలకులు విభజిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష నేతలపై సీబీఐ, ఈడీతో దాడులు జరిపిస్తూ నిరసన స్వరాలను అణగదొక్కుతున్నారని అన్నారు.
ఇక భారత్, చైనా విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్పై రష్యా ఎలాగైతే దాడులు చేస్తుందో.. అలాగే భారత్పై చైనా కూడా దాడులు చేసే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలు భారత్లో భాగం కాదని చైనా వాదన అని, ఈ ప్రాంతాల్లో చైనా తన బలగాలను మోహరించిందన్నారు. ఈ విషయాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అంత సీరియస్గా తీసుకున్నట్లు కనిపించడం లేదని ఆరోపించారు.