Bharat Jodo Yatra | కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్ముకశ్మీర్లో కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా ఎముకలు కొరికే చలిలోనూ రాహుల్.. టీ షర్ట్ ధరించి జోడో యాత్రలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ మొదటిసారి జాకెట్ ధరించి యాత్రలో పాల్గొన్నారు. ప్రస్తుతం దేశంలో చలి తీవ్రత బాగా పెరిగింది. ఉత్తరాదిలో అయితే పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోయాయి. జనం చలికి గజగజ వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం జమ్ములోని కతువాలో తన నడకను కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ.. జాకెట్ ధరించి కనిపించారు.
గత కొన్ని రోజులుగా తీవ్రమైన చలిలోనూ రాహుల్ టీషర్ట్ ధరించే యాత్ర కొనసాగిస్తుండటం పట్ల తీవ్రమైన చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని రాహుల్ను ప్రశ్నించగా.. ‘నేను టీషర్ట్ వేసుకోవడం గురించి అందరూ ఎందుకు అంతగా కంగారు పడుతున్నారు..? చలి గురించి నాకు భయం లేదు కాబట్టి నేను స్వెట్టర్ వేసుకోవడం లేదు. ఒకవేళ నాకు చలి భరించలేకుండా ఉందనే ఫీలింగ్ కలిగితే.. అప్పుడు స్వెట్టర్ వేసుకోవడం గురించి ఆలోచిస్తా’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే, రాహుల్ టీ షర్ట్పై బీజేపీ నాయకులు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. టీ షర్ట్ లోపల థర్మల్స్ ధరిస్తున్నారని రాహుల్పై ఆరోపణలు చేశారు.
#WATCH | Bharat Jodo Yatra resumes from Kathua in Jammu & Kashmir on the 125th day of its journey; sees the participation of Shiv Sena (Uddhav Thackeray) leader Sanjay Raut today pic.twitter.com/Ve81omvQ5m
— ANI (@ANI) January 20, 2023
సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర నేటితో 125వ రోజుకు చేరుకున్నది. ఇప్పటికే 14 రాష్ట్రాల్లో కొనసాగింది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ 14వ రాష్ట్రం. గురువారం సాయంత్రం పంజాబ్లోని పఠాన్కోట్ మీదుగా ఆయన జమ్ముకశ్మీర్లో ప్రవేశించారు. రాహుల్ గాంధీ ఇప్పటి వరకు 3,400 కిలోమీటర్లు నడిచారు. ఈ యాత్ర జనవరి 30వ తేదీన శ్రీనగర్లో ముగుస్తుంది.