న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీపై తీసిన బీబీసీ డాక్యుమెంటరీ సిరీస్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించినా వాస్తవాలను మరుగుపరచలేరని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోదీపై బీబీసీ ది మోదీ క్వశ్చన్ పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించిన క్రమంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వైఖరి రక్షణాత్మక ధోరణితో ఉందని వ్యాఖ్యానించారు.
ఇవి అసహన రాజకీయాలని తాను భావిస్తున్నానని చెప్పారు. సత్యాన్ని దాచలేరని, వాస్తవం వెలుగులోకి వస్తుందని పేర్కొన్న రాహుల్ మనం ప్రజాస్వామిక దేశంలో ఉన్నామని గుర్తుచేశారు. మీరు సత్యాన్ని ఎంత గట్టిగా తొక్కిపెట్టినా అది బయటకు రాకతప్పదని స్పష్టం చేశారు.
మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ సిరీస్ను భారత్ తోసిపుచ్చింది. ఇది పక్షపాతధోరణితో ఉందని, ఎలాంటి దిశలేదని పేర్కొంది. ఈ సిరీస్ను పోస్ట్ చేసిన యూట్యూబ్ చానెల్స్ లింకులను, ట్విట్టర్ ఖాతాలను కేంద్రం శనివారం బ్లాక్ చేసింది. బీబీసీ సిరీస్ ప్రసారం కాకుండా నిలువరించడాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. కేంద్రం సెన్సార్షిప్ విధించడం తగదని మండిపడ్డాయి. మరోవైపు ఎంతో పరిశోధన చేపట్టి ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించామని తమ సిరీస్ను బీబీసీ సమర్ధించుకుంది.