న్యూఢిల్లీ : ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో వ్యాక్సిన్ వ్యూహంపై స్పష్టంగా ఆలోచించాల్సిన అవసరం నెలకొందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. నూతన వేరియంట్పై ప్రస్తుతం వాడుకలో ఉన్న కొవిడ్-19 వ్యాక్సిన్లు కచ్చితంగా పనిచేస్తాయని చెప్పలేమనే ప్రచారం సాగుతోందని అన్నారు. మనం దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎలా పూర్తిచేయలనేదానిపై ఆచితూచి వ్యవహరించాలని, మరో బూస్టర్ డోస్తో ముమ్మరంగా వ్యాక్సినేషన్ చేపట్టేందుకు సిద్ధం కావడాన్ని అంగీకరించాలని సూచించారు.
భారత్లో గురువారం కర్నాటకలో తొలిగా ఒమిక్రాన్ కేసులు బయటపడిన సంగతి తెలిసిందే. మరోవైపు బెంగళూర్లో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడటంతో కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్ము శుక్రవారం వైద్య నిపుణులు, సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని అడ్డుకుని నియంత్రించే చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. నూతన మార్గదర్శకాలను రూపొందించేందుకు చర్యలు చేపడతామని ఈ భేటీకి ముందు సీఎం బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు.