న్యూఢిల్లీ : లడఖ్లో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) శుక్రవారం కార్గిల్లో జరిగిన ర్యాలీలో కాషాయ పార్టీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. లడఖ్ ప్రజల నుంచి భూములు గుంజుకుని వాటిని అదానీ గ్రూపునకు కట్టబెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. స్ధానికుల భూములను కొట్టేయడం వీలు కాదనే భయంతోనే లడఖ్ ప్రజలకు కాషాయ పార్టీ సరైన ప్రాతినిధ్యం కల్పించడం లేదని దుయ్యబట్టారు.
మీ భూములను అదానీకి అప్పచెబితే ఇక్కడ ఆయన ప్లాంట్ ఏర్పాటు చేస్తారని, ఇదే బీజేపీ కుయుక్తులని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మీ భూముల్లో ప్లాంట్ ఏర్పాటు చేసే అదానీ మీకు ఎలాంటి లాభాలను పంచబోరని, ఇలా జరగకుండా లడఖ్ ప్రజలు అడ్డుకోవాలని ఆయన పిలుపు ఇచ్చారు. లడఖ్ వ్యూహాత్మక ప్రదేశమని, ఇక్కడ భారత భూభాగాన్ని చైనా తీసుకున్నది సుస్పష్టమని, అయితే విపక్ష సమావేశంలో భారత భూభాగంలో చైనా ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదని ప్రధాని చెప్పారని అన్నారు.
ప్రధాని మాటలు అసత్యాలని పేర్కొన్నారు. గత కొద్దినెలల కిందట తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ భారత్ జోడో యాత్ర చేపట్టానని ఆ సందర్భంగా ఇక్కడ హిమపాతంతో లడఖ్ ప్రాంతాన్ని సందర్శించలేకపోయానని చెప్పుకొచ్చారు. అయితే ఈసారి బైక్పై ఇక్కడ యాత్ర సాగించానని అన్నారు. దేశంలో బీజేపీ-ఆరెస్సెస్ వ్యాప్తి చేస్తున్న విద్వేషం, హింసను తిప్పికొట్టేందుకే తాను భారత్ జోడో యాత్ర చేపట్టానని గుర్తుచేశారు.
Read More :