న్యూఢిల్లీ : ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ అంశానికి సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. ప్రజాధనంతో గత ప్రభుత్వాలు 70 ఏండ్లుగా నిర్మించిన ప్రతిష్టాత్మక ఆస్తులను పాలక ప్రభుత్వం తెగనమ్మే ప్రక్రియను చేపట్టిందని ఆరోపించారు. జాతీయ మానెటైజేషన్ పైప్లైన్ ద్వారా మోదీ ప్రభుత్వం తన పారిశ్రామిక స్నేహితులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తోందని రాహుల్ విమర్శించారు.
గత 70 ఏండ్లుగా బారత్లో ఏమీ జరగలేదని చెబుతున్న బీజేపీ ప్రస్తుతం గత 70 ఏండ్లుగా సృష్టించిన ఆస్తులను అమ్మేందుకు పూనుకుందని ఆరోపించారు. తాము ప్రైవేటీకరణకు వ్యతిరేకం కాదని అయితే రైల్వేల వంటి వ్యూహాత్మక ఆస్తుల ప్రైవేటీకరణ సరైంది కాదని అన్నారు. కేంద్రం ప్రభుత్వ ప్రైవేటీకరణ ప్రణాళికలు కీలక రంగాల్లో గుత్తాధిపత్యానికి దారితీస్తుందని, ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొంటుందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం సంఘటిత రంగంలో ఏకస్వామ్యాన్ని సృష్టిస్తూ మరోవైపు అసంఘటిత రంగాన్ని ధ్వంసం చేసేలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ప్రజలు చెమటోడ్చి సాధించిన కోట్ల విలువ చేసే ఆస్తులను మోదీ ప్రభుత్వం తన బిలియనీర్ స్నేహితులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.